Monday, November 19, 2012

ఇది కధ కాదు 6 : పోరాటం సాగిందిలా...!

1922 డిసెంబర్ మాసాంతం

రాజు సేన విచ్చిన్నమయిపోయిందని ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వానికీ, పోలీసులకీ మళ్ళీ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సమాచారం కోసం వేసిన టెలీఫోన్ లైన్లని నాశనం చెయ్యడం, పోలీసుల కోసం వస్తున్న సామాన్లనీ, ఆహార పదార్ధాలనీ కొల్లగొట్టడం ద్వారా తన ఉనికిని చాటుకుంది రాజుదళం. అయితే కొండల్లో డ్యూటీ చెయ్యమని మొండికేశారు పోలీసులు. దీనికి కారణం లేకపోలేదు. మన్యం లోని వాతావరణ పరిస్థితులనీ ముఖ్యంగా ఏ సౌకర్యాలు లేని చోట చలి, వర్షం, అంటు రోగాలు, విషజ్వరలాని తట్టుకోవడం చాలామందికి దుర్లభమనిపించింది. పెద్ద మొత్తం లో ఆహారం, ఇతర సామగ్రీ, ఆయుధాలూ, ఫిరంగులూ, మందుగుండూ మోసుకుంటూ తెలియని అడవి దారుల్లో కొండలు ఎక్కుతూ దిగుతూ, ఎప్పుడు రాజుదళం చేతుల్లో చస్తారోనన్న భయం తో చాలామంది రాజీనామాలు చేశారు. అప్పటికే పోలీసుల్లో ఒక నమ్మకం ఉంది. "రాజు మంత్రమేస్తే కండిషన్ లో ఉన్న తుపాకీ కూడా పేలదని". పోలీసులు రాజుకి భయపడుతున్నారన్న విషయం రూఢీ అవ్వటమే కాకుండా, రాజు దళం తో కుమ్మక్కు అయ్యారనే అభిప్రాయం కూడా ప్రభుత్వానికి కలగడంతో రాజీనామాలని ఆమోదించి, మొత్తం పోలీసుదళాన్నే మార్చెయ్యాలన్న నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం.

అప్పటికే చాలామంది దళసభ్యులు పోలీసుల చేతికి దొరికేసినాగానీ, 1923 జనవరి లో 16 మంది తో రాజు మన్యం గ్రామాల్లో సంచరిస్తున్నాడనే వార్త మళ్ళీ హడావిడి సృష్టించింది. సుమారు 800 మంది తో కూడిన పోలీసు బృందం రాజు ఆచూకీ కోసం వెతకడం మొదలెట్టింది. అందులో భాగంగా పోలీసు సామాగ్రి మొయ్యడానికి అమాయక మన్యం ప్రజల చేతనే బలవంతం గా తీసుకెళ్ళి పనిచేయిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలని భయపెట్టీ, బతిమాలీ, సారాపోయించీ ఎలాగోలా రాజు సేన గురించిన వివరాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.ఒక ఊళ్ళోకి రాజు వచ్చిన సంగతి ఆయన ఆ ఊరు విడిచి వెళ్ళిన తరువాతే పోలీసులకి తెలిసేది. ప్రభుత్వానికి సహకరించని అటువంటి ఊళ్ళ మీద అధిక మొత్తం లో సుంకం విధించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య  కొత్త సభ్యుల కోసం అన్వేషిస్తూ, గిరిజన గ్రామాలని తట్టి లేపుతూ మళ్ళీ ఉద్యమాన్ని ఉధృతం చేసే పనిలో పడ్డారు రాజు, అతని అనుచరులు...!

*********************************************************************************
1923 ఏప్రియల్ 17
అన్నవరం లో అడుగెట్టిన అల్లూరి

ఆయుధాల కోసం అన్నవరం పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు రాజు. కేవలం నలుగురు అనుచరులతో.
చెరుకూరి నరసింహ మూర్తి అనే గృహస్థుకి ప్రజలు పరిగెడుతూ కన్పించడం, కారణం అల్లూరి శ్రీరామరాజు రాక అని తెలియడం తో ఆయన స్వయం వెళ్ళి రాజుని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నారు. రాజు ఎలా ఉన్నాడూ? ఎంత వయసు? అతని మాటల్లో మర్యాద ఎలాంటిది? అతని అలవాట్లేమిటీ? అతని అనుచరులెలాంటి వారు? ఉద్యమం మీద రాజు అభిప్రాయాలేమిటీ? మన్యం బయట గ్రామాల్లో కూడా రాజు కి ఎంతటి ప్రజాకర్షణ ఉన్నదీ? మొదలైన విషయాలన్నీ ఆ తర్వాత ఆయన ఆంధ్రపత్రిక విలేఖరి ని కలిసి చెప్పడం తో 1923 ఏప్రియల్ 21 నా "ఆంధ్రపత్రిక" లో అన్నవరం ఘటన గురించిన పూర్తి కధనం ప్రచురించబడింది. (తప్పని సరిగా చదవవలసిన ఆర్టికల్ ఇది)

(ఆ రోజు వార్తా పత్రిక ని ఇక్కడ చదవవచ్చు. లేదా కింద స్క్రీన్ షాట్స్ లో చూడవచ్చు. ఇమేజ్ మీద క్లిక్ చేయండి.)

(head line)


(వార్త)






 










 రాజు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గమనించినట్లయితే.. గయ లో జరిగిన సమావేశాన్ని, స్వయంగా వెళ్లక పోయినా, తన సూక్ష్మ శరీరం ద్వారా  చూశానని చెప్పాడు. తన తపశ్శక్తి ద్వారానో, యోగ విద్య ద్వారానో అటువంటి స్థితి కి చేరుకోగలిగాడేమో అనిపిస్తుంది. ఒకే సమయం లో రెండు చోట్ల రామరాజు ఉన్నట్టు బలమైన సాక్షాలు ఉండటం, తప్పించుకోడానికి వీలు లేని పరిస్థితుల్లో కూడా శత్రువు నుండి తప్పించుకోవటం మొదలైన వాటికి కారణం ఇదీ సరిగ్గా చెప్పలేం. రాజుకి నిజంగా దివ్య శక్తులున్నాయన్న నమ్మకం మాత్రం ప్రజల్లోనూ, పోలీసుల్లోనూ బలంగా ఉన్నాదనీ ఈ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. అయితే పోలీసులని చిత్తు చెయ్యడానికీ, భయపెట్టడానికీ రాజు వేసిన పధకాలుగా కూడా అనుకోవచ్చు. మరొక సంగతేంటంటే వార్త హెడ్ లైన్స్ లో "అల్లూరి సీతా రామరాజు" అని వేశారు. అప్పటికి గిరిజన కార్యకలాపాలన్నీ భద్రాచలం నుండే నిర్వహించేవారు. భద్రాచలంలో సీతారాముల వారి గుడి ఫేమస్ అవ్వడంతో  బ్రిటిష్ వారికి "సీతారాముడు" అనే పేరు తో ఎక్కువ పరిచయం. ఈ కారణం గానే శ్రీ రామరాజుని  సీతా రామరాజు గా పిలిచారనీ, అదే అందరికీ అలవాటయ్యి ఆ పేరు స్థిరపడిందని  ఒక వాదన ఉంది. రాజు కి ఎంతో ఇష్టమయిన తన చెల్లెలు "సీత" పేరు ని తన పేరులో కలుపుకున్నాడన్న వాదన కూడా ఉంది. అయితే రాజు రాసిన ఉత్తరాలలోనూ, సెర్టిఫికేట్స్ లోనూ "అల్లూరి శ్రీ రామరాజు" అని మాత్రమే ఉంది.

అన్నవరం పోలీస్ స్టేషన్ లో తుపాకులు,మందుగుండూ లభించలేదు గానీ కత్తులు మాత్రం స్వాధీన పరచుకున్నాది రాజు బృందం. రామరాజుని సబ్ ఇన్స్పెక్టర్, పోస్టుమాస్టర్, డిప్యూటీ తహశీల్దారులు  తమ ఇళ్ళకి ఆహ్వానించారు. వారింట స్త్రీలు ఆయన కాళ్ళు కడిగి గౌరవించారు. రాజు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాక ప్రజలు రాజుకి బట్టలు పెట్టారు. ఫలాలు, కొంత డబ్బు ఇచ్చారు. రాజు వెనక ఉన్న ఆ నలుగురి లో ఆ రోజు గాం గంటందొర, అతని సోదరుడు గాం  మల్లుదొర కూడా ఉన్నారు. రాజు అన్నవరం విడిచి వెళ్ళిపోయాక వచ్చిన అధికారులు, ప్రజలు అతనికి బ్రహ్మరధం పట్టారన్న విషయం తెలుసుకొని అన్నవరం మీద Rs 4000 ల శిక్షా సుంకం విధించారు.

అయితే.. రాజు కీ, అతని ఉద్యమానికి ప్రజల మద్దతు ఎంతగానో ఉందనీ, ఒక్క ఎదురుదెబ్బకి భయపడి రామరాజు తన పోరాటాన్ని ఆపే ఆలోచనలో లేడనీ, ఇది సోమవారం మొదలెట్టి శుక్రవారం ముగింపు పలికే ఉద్యమం కాదనీ ప్రభుత్వానికి తెలిసొచ్చింది అన్నవరం ఘటన వల్ల.

**********************************************************************************

1923, మే నెల
 రాజుదళం లోకి పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన వేగిరాజు సత్యనారాయణ రాజు అనే వ్యక్తి సేనాని గా ప్రవేశించాడు.
మన్యం ప్రజల తిరుగుబాటు కి కారణం, కఠిన అటవీ చట్టాలతో పాటూ "బాస్టియన్" విధానాలే కారణం అని భావించింది ప్రభుత్వం. అయిష్టంగానే బాస్టియన్ ని నెల్లూరికి బదిలీ చేసి అతని స్థానం లో "కందర్ప మూరెన్న పంతులు" ని నియమించింది. సుంకం వసూలు కోసం కొయ్యూరు వచ్చిన అతన్ని రాజు అనుచరులు కిడ్నాప్ చేసి గంటందొర దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఉద్యమం ఉద్దేశ్యం, దానికి గల కారణాలని వివరించి అతన్ని వదిలేశాడు గంటందొర.అంతేకాక స్వతంత్ర పోరాటం కోసం ప్రతీ గ్రామాన్నీ తట్టిలేపడం, ఉద్యమకారులని పట్టిస్తున్న గ్రామ మున్సబులని శిక్షించడం, నాటు తుపాకీలని సేకరించడం మొదలైన  కార్యక్రమాలు మొదలెట్టారు. ఇందులో భాగంగా విప్లవకారులని ప్రభుత్వానికి పట్టించిన ఈబోలు గ్రామ మున్సబు చెవి నరికేశాడు అగ్గిరాజు. జూన్ 8 నాటికి 30 మంది, జూన్ 17 నాటికి 60 మంది రాజుబృందం లో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. రాజు విధానాలకి ఆకర్షితులైన మైదాన ప్రాంత ప్రజలు కూడా ఉద్యమం లోకి వచ్చి చేరుతున్నారు.

రామరాజు సేన పఠిష్టమయ్యే దిశ గా అడుగులు వేస్తుంది....!!!

4 comments:

Padmarpita said...

అసాంతం చదివి ఒక ఆర్టికల్ రాయాలి మీ రచనా శైలిపై అనుకున్నా కాని ఆగలేక ఇలా.....అధ్భుతంగా రాస్తున్నారు!Congrats

వేణూశ్రీకాంత్ said...

నీ వెర్సటాలిటీ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది రాజ్... ఆర్కైవ్స్ తో సహా ఇంత వివరంగా ప్రజంట్ చేయడం చాలా బాగుంది.

Sravya V said...

Very Nice Raj ! I really appreciate your efforts !

రాజ్ కుమార్ said...

పద్మార్పిత గారూ, వేణూజీ, శ్రావ్యగారూ.. ధన్యవాదాలండీ ;) ;)